వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో విషయంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తీరుపై బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, గాజాలో కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న జో బైడెన్.. బెంజమిన్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన వార్షిక ప్రసంగం తర్వాత సెనెటర్ మైకెల్ బెన్నెట్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితరులతో బైడెన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా గాజాలో మానవ సంక్షోభంపై బెన్నెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు బైడెన్ సమాధానమిస్తూ.. గాజా విషయంలో నెతన్యాహుతో ముందుగానే చెప్పినట్టు తెలిపారు. అలాగే, గాజాలో మానవ సంక్షోభాన్ని నివారించడానికి నెతన్యాహు చేయాల్సినంత చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహు తీరు ఇజ్రాయెల్కు సహాయం చేసే దాని కన్నా ఆదేశ ప్రజలను బాధపెట్టేలా ఉందన్నారు. నెతన్యాహుకు ఇజ్రాయెల్ను కాపాడే హక్కు ఉంది. ఇదే సమయంలో ఆయన తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజలకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
Latest: Benjamin Netanyahu 'hurting Israel more than helping Israel' with Gaza war approach
- Joe Biden— Totlani Krishan🇮🇳 (Modi Ka Parivar) (@kktotlani) March 10, 2024
ఇదిలాఉండగా.. కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 30వేలకుపైగా ప్రజలు మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మరోవైపు.. హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్లో 1200 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు. ఇక, ఇజ్రాయెల్ నుంచి హమాస్ దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో 99 మంది గాజాలో సజీవంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు.