వాషింగ్టన్: ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలో అయోవా రాష్ట్రం అతలాకుతలమైంది. వర్షపు నీటిలో మునిగి రహదారులు కనిపించకుండాపోయాయి. ఇళ్లు నీట మునగడంతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. జలదిగ్భందంలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. పడవల్లో జనాలను వేరే చోట్లకు తరలిస్తున్నారు. అయోవా రాష్ట్రంలోని సియాక్స్ కౌంటీలోని రాక్వ్యాలీ జనావాసం మొత్తం జలమయమైంది. 21 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి విధించారు.
45.72 సెంటీమీటర్ల వర్షపాతం
సౌత్ డకోటాలోనూ భీకర వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ సియాక్స్ ఫాల్స్ సమీపంలోని కాన్టన్ పట్ణణంలో ఏకంగా 45.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జాతీయ రహదారులపైనా వర్షపు నీరు నిలిచింది. దీంతో హైవేలపై రాకపోకలను పోలీసులు ఆపేశారు. మిన్నెసోటాలోనూ రాష్ట్ర రహదారులను మూసేశారు.
మిగతా రాష్ట్రాలు అతి ఎండలు
అమెరికాలో ఓవైపు వర్షాలు వణికిస్తుంటే మిగతా రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. 1.5 కోట్ల జనాభాను వడగాల్పులు వేధిస్తున్నాయని, మరో 9 కోట్ల మంది భయంకర ఎండల బారిన పడ్డారని జాతీయ వాతావరణ సంస్థ ఆదివారం ప్రకటించింది. 1936 తర్వాత ఎన్నడూలేనంతగా గత ఏడాది అత్యధిక వడగాల్పులు అమెరికాకు ముచ్చెమటలు పట్టించాయి. దీంతో గత 45 ఏళ్లలో ఎప్పుడూలేనంతగా 2,300 మంది ఎండసంబంధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం వాషింగ్టన్, కాలిఫోరి్నయాలోని సెంట్రల్ వ్యాలీల్లో అధిక ఉష్ణోగ్రత నమోదుకావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ADVERTISEMENT
ADVERTISEMENT