మాలె: భారత్ పొరుగు దేశం మాల్దీవుల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత్తో దౌత్యపరంగా వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా భారీ నౌక మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. దీంతో, ఈ పరిణామం రాజకీయంగా ప్రాధానత్యను సంతరించుకుంది. మరోవైపు.. భారత్ను కవ్వించేందుకే డ్రాగన్ కంట్రీ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్-03 తాజాగా మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని మాలె తీరంలో ఇది లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, 4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం అడుగు భాగంలోని ఉపరితలంపై పరిశోధన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనల్లో భాగంగా ఇక్కడి సముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం బీజింగ్కు లభిస్తుందని నావికాదళ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉండగా.. గతంలో చైనా ఇదే తరహాలో శ్రీలంకలో ఓడలను నిలిపింది. అయితే, ఈసారి మాత్రం కొలంబో ఇందుకు అంగీకరించలేదు. దీంతో, చైనా ప్లాన్ ప్రకారం మాల్దీవుల్లో మకాం వేసింది. ఇక, ఈ నౌకలు సైనిక-పౌర ప్రయోజనాలకు సంబంధించనవని భారత అధికారులు ఆరోపిస్తున్నారు. వాటిలోని టెక్నాలజీ.. భారత్కు చెందిన నిఘా సమాచారాన్ని సేకరిస్తాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇవి భారత్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు , గగన తలంపై నిఘా ఉంచగలవు. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఇవి ఫోకస్ పెట్టే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు.
🚨Maldives' Chinese Ship Visit Raises India's Ocean Security Concerns
The Indian Ocean, the Chinese research ship Xiang Yang Hong 03 is scheduled to arrive in the Maldives on Thursday. Over three weeks, the research institute-owned vessel surveyed waters beyond the exclusive… pic.twitter.com/iZ2I5tKVkR— CRUXX | News App (@CRUXX_Ind) February 22, 2024
మరోవైపు.. ఇటీవలే భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరంగా పలు విబేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ.. లక్షద్వీప్కు వెళ్లి పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పలు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పలు మాల్దీవుల ఎంపీలు.. భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో, భారత పర్యాటకులు మాల్దీవుల ట్రిప్స్ను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవులకు ఆర్థికపరంగా నష్టం కలుగుతోంది.