సాక్షి, అమరావతి: ‘మన రాజ్యాంగం సార్వబౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, న్యాయ, సమానత్వ, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలకు హామీ ఇస్తుంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ఇలాంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలని కోరారు. రాజ్యాంగ వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ఈవీఎంల పని తీరుపై దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనిపించాలి.
మన దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు వాక్ స్వాతం్రత్యాన్ని హరించడానికి.. ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి కొంత కాలంగా దూకుడుగా ప్రయతి్నస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాజ్యాంగాన్ని రూపొందించి, ఇదే పవిత్రమైన రోజున ఆమోదించి, మన దేశాన్ని ఏకీకృత, సమానత్వం వైపు నడిపిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్తోపాటు దార్శనిక నాయకులకు మనం ఘనంగా నివాళులు అర్పిద్దాం’ అని పేర్కొన్నారు.