సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులతోపాటు ఓటర్ల జాబితాలో పేరు లేనివారు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. వచ్చే నెల 28వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
18 సంవత్సరాలు నిండిన వారితోపాటు జాబితాలో పేర్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఓటర్లుగా నమోదు చేస్తామన్నారు. ఓటరు నమోదుతో పాటు అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. వాటిన్నింటినీ డిసెంబర్ 24లోగా పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో వచ్చే నెల 9, 10, 23, 24 తేదీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాతోపాటు సవరణలకు దరఖాస్తులను స్వీకరించడానికి బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు.