సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటలు అత్యంత కీలకమని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈదురు గాలులు వీసే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. బుధవారం సాయంత్రంలోపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వర్ష ప్రభావం కారణంగా విద్యుత్ అంతరాయాలు, రవాణా అంతరాయాలు సంభవించే అవకాశాలు ఉండటంతో స్థానిక యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
🔴 రెడ్ అలర్ట్:
విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
🟡 ఎల్లో అలర్ట్:
తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించింది. అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని సూచించింది. మొత్తం పరిస్థితిని చూస్తే రాబోయే గంటలు రాష్ట్రానికి కీలకంగా మారనున్నాయి.