సాక్షి, తిరుపతి/రేణిగుంట (తిరుపతి జిల్లా)/తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు.
ప్రధానికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, డాక్టర్ గురుమూర్తి, రెడ్డెప్ప, జీవీఎల్ నరసింహారావు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, కోనేటి ఆదిమూలం, వరప్రసాద్రావు, వెంకటేగౌడ, ఎమ్మెల్సీ కల్యాణచక్రవర్తి, వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్రెడ్డి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ డీకే బాలాజి, తిరుపతి కమిషనర్ హరిత, పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక కాన్వాయ్ ఆపి బీజేపీ శ్రేణులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరి వెళ్లారు.
తిరుమలకు చేరుకున్న ప్రధాని
ఇక తిరుమలకు చేరుకున్న ప్రధాని మోదీకి శ్రీ రచనా అతిథిగృహం వద్ద ఈఓ ధర్మారెడ్డి, రచనా టెలివిజన్ డైరెక్టర్ తుమ్మల రచనా స్వాగతం పలికారు. శ్రీవారిని ఆయన సోమవారం ఉదయం దర్శించుకుంటారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి.
ADVERTISEMENT
ADVERTISEMENT