బంగారం.. ఓ సింగారం.. ఓ ఆచారం..ఓ అవసరం.. ఓ ఫ్యాషన్.. ఇలా పేరు ఏదైనా నిత్య జీవితంలో దీనితో పెనవేసుకున్న బంధం వెలకట్టలేనిది.ఇంతగా ప్రాధాన్యత దక్కించుకున్న ఈ పసిడి ధర ఇప్పుడు కొండెక్కింది. కొండంటే మామూలు కొండ కాదు.. ఏకంగా ఎవరెస్టే ఎక్కి జిగేల్ జిగేల్మంటోంది.
బంగారు కొనాలంటేనే భయం వేస్తోంది. గోల్డ్ ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇలా ధరలు పెరిగిపోతూ ఉంటే ఆచితూచి కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో గోల్డ్షాపులకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించాల్సిందే.
– నవిత, కిడ్స్ స్టూడియో నిర్వాహకులు, కర్నూలు
సాక్షి ప్రతినిధి కర్నూలు: చరిత్రలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.80 వేల మార్క్ను దాటింది. బులియన్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ.80,070కి చేరింది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలపై మరోసారి చర్చ మొదలైంది.
చాలా వేగంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని కొందరు అంటుంటే.. ఇంకొందరు త్వరలోనే రూ.80 వేలు కాస్త రూ.లక్షకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు. ఇంకోవైపు.. ఆశ్వీయుజ మాసంలో పెళ్లిళ్లకు సిద్ధమైన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు బంగారు ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు.