గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్‌

Published Sat, May 4 2024 5:34 AM

Central Election Commission instructions to District Election Officers

ఆ ప్రచారంపై తక్షణ చర్యలు తీసుకోండి 

జిల్లా ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు 

సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో మీకు వ్యక్తిగతంగా ఇంత లబ్ధి చేకూరనుంది అంటూ గ్యారంటీలు, ష్యూరిటీల పేరిట ప్రచారం చేస్తున్న రాజకీయ  పార్టీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ద్వారా వ్యక్తిగతంగా ఇంత లభిస్తుందంటూ గ్యారంటీ కార్డులు ఇవ్వడం, ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది.

 ఈ విధంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై నిబంధనలకు అనుగుణంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. పలు రాజకీయ పార్టీలు ఈ విధమైన ప్రచారానికి ఒడిగడుతున్నాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ మేనిఫెస్టో డాట్‌ కామ్‌ పేరిట ప్రత్యేకంగా ఒక వెబ్‌లింక్, యాప్‌ను డెవలప్‌చేసి అందులో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బాబు ఆరు ష్యూరిటీల పేరిట మీ కుటుంబానికి ఇంతమొత్తం లబ్ధిచేకూరుతుందంటూ గ్యారంటీ కార్డులు, మెసేజ్‌లు పంపుతుండటంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. 

1. ఓటర్లు మిస్‌డ్‌ కాల్, మొబైల్‌ నంబర్, టెలిఫోన్‌ నంబర్లను ఇవ్వడం ద్వారా నమోదు అవ్వండి అంటూ పత్రికా ప్రకటనలివ్వరాదు.  
2. కరపత్రాల రూపంలో గ్యారంటీ కార్డులను పంచుతూ ఓటర్ల నుంచి పేరు, వయసు, మొబైల్‌ నంబర్, ఎపిక్‌ నంబర్, నియోజకవర్గం పేరు సేకరించరాదు. 
3. ప్రభుత్వ పథకాల లబ్ధి పేరుతో రేషన్‌కార్డు, బూత్‌ నంబర్, బ్యాంకు అకౌంట్‌ నంబర్, నియోజకవర్గం పేరు వంటి వివరాలు తీసుకోరాదు.  
4. రాజకీయ పారీ్టలు వెబ్‌ ప్లాట్‌ఫాం, యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించరాదు. 
5. ప్రస్తుతం లబ్ధి పొందుతున్న పథకాల వివరాలతో పత్రికా ప్రకటనలు, కరపత్రాలు ఇవ్వరాదు.  

Advertisement
Advertisement